తాతను దేవుడిగా భావిస్తూ గుడి కట్టి ఆరాధిస్తున్న మనవడు!

  • ఈశ్వర్ ను చిన్నప్పుడే దత్తత స్వీకరించిన మొగులప్ప
  • ఈశ్వర్ కు మొగులప్ప పెద్ద తాత వరుస
  • కన్నబిడ్డ కంటే మిన్నగా ఈశ్వర్ ను సాకిన మొగులప్ప
  • 2013లో మొగులప్ప మృతి
  • రూ.24 లక్షలతో ఆలయం నిర్మించిన ఈశ్వర్
జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు గుడికట్టి, విగ్రహాలు ఏర్పాటు చేసి ఆరాధించడం తెలిసిందే. అయితే, తెలంగాణలో ఓ వ్యక్తి తన తాతనే ఆరాధ్యదైవంగా భావించి నిత్యం పూజలు చేస్తున్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా నావల్గ గ్రామానికి చెందిన ఈశ్వర్ ఓ రైతు. ఈశ్వర్ ను పెద్ద తాత వరుసయ్యే మొగులప్ప దత్తత తీసుకుని పెంచారు. కన్నబిడ్డ కంటే మిన్నలా ఈశ్వర్ ను పెంచారు. ఈశ్వర్ కూడా అంతే మమకారంతో మెలిగేవాడు.

అయితే, 2013లో మొగులప్ప మరణించడంతో ఈశ్వర్ తీవ్ర మనో వేదనకు లోనయ్యాడు. తాత జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకునేందుకు ఏదైనా చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా రూ.24 లక్షల ఖర్చుతో ఓ ఆలయం నిర్మించి, తాత చిత్రపటాలను అందులో ప్రతిష్టించారు. నిత్యం తాతకు పూజలు చేయందే ఈశ్వర్ దినచర్య ఆరంభం కాదు. అంతేకాదు, ప్రతి సంవత్సరం మొగులప్ప వర్ధంతి నాడు ఘనంగా ఆరాధనోత్సవాలు నిర్వహిస్తుంటాడు. ఈశ్వర్ నిర్మించిన ఈ ఆలయం అందరినీ ఆకర్షిస్తోంది.

Eashwar
Mogulappa
Temple
Grandfather
Navalga Village
Vikarabad District

More Telugu News